1 యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును. అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.౹
2 అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి
3 తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించువరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.౹
4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.౹
5 ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి –వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను.౹
6 అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి.౹
7 లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.౹
8 ఏశావు–నాకు ఎదురుగావచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు–నా ప్రభువు కటాక్షము నామీద వచ్చుటకే అని చెప్పెను.౹
9 అప్పుడు ఏశావు–సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.౹
10 అప్పుడు యాకోబు–అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా;౹
11 నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్త గించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని
12 –మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా
13 అతడు–నాయొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును.౹
14 నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను.౹
15 అప్పుడు ఏశావు–నీ కిష్టమైనయెడల నాయొద్దనున్న యీ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా–అతడు అదియేల? నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను.౹
16 ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను.౹
17 అప్పుడు యాకోబు సుక్కోతుకుప్రయాణమై పోయి తనకొక యిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.౹
18 అట్లు యాకోబు పద్దనరాములోనుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.౹
19 మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని
20 అక్కడ ఒక బలిపీఠముకట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలుఅను పేరు పెట్టెను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/33-bd95203e5b38d0e754a91812bb238254.mp3?version_id=1787—