1 ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసి కొనినప్పుడు–మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.౹
2 మరియు అతడు–చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా
3 యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొన బోయిరి.౹
4 అయినను–ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
5 కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.౹
6 అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియైయుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనముచేసిరి.౹
7 యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపెట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి–మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు–ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.౹
8 యోసేపు తన సహోదరులను గురుతు పట్టెనుగాని వారతని గురుతు పట్టలేదు.౹
9 యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని–మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితో ననగా
10 వారు–లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి;౹
11 మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.౹
12 అయితే అతడు–లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.౹
13 అందుకు వారు– నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనానుదేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.౹
14 అయితే యోసేపు– మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.౹
15 దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనేగాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.౹
16 మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి
17 వారిని మూడుదినములు చెరసాలలో వేయించెను.
18 మూడవదినమున యోసేపు వారిని చూచి–నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.౹
19 మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.౹
20 మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.౹
21 అప్పుడు వారు–నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒక నితో ఒకడు మాటలాడుకొనిరి.౹
22 మరియు రూబేను – ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాప రాధము మనమీద మోపబడుచున్నదని వారికి ఉత్తర మిచ్చెను.౹
23 అయితే ద్విభాషి వారి మధ్యనుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.౹
24 అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యో నును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.౹
25 మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణముకొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.
26 వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.౹
27 అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను.౹
28 అప్పుడతడు–నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి–ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.౹
29 వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి.౹
30 ఎట్లనగా–ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.౹
31 అప్పుడు–మేము యథార్థవంతులము, వేగులవారము కాము.౹
32 పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి.౹
33 అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి–మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి,౹
34 నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులేగాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి.
35 వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.౹
36 అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి– మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.౹
37 అందుకు రూబేను–నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను.౹
38 అయితే అతడు–నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/42-92187cc02d27f5c8cb44cecea2e7940b.mp3?version_id=1787—