1 వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటిదిక్కుననున్న అమోరీయుల రాజులందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీయుల భయముచేత వారికిక ధైర్యమేమియు లేక పోయెను.
2 ఆ సమయమున యెహోవా–రాతికత్తులు చేయించుకొని మరల ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా
3 యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను.౹
4 యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులోనుండి బయలుదేరినవారందరిలో యుద్ధసన్నద్ధులైన పురుషులందరు ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి.౹
5 బయలుదేరిన పురుషులందరు సున్నతి పొందినవారే కాని ఐగుప్తులోనుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొందియుండలేదు.౹
6 యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధులందరు యెహోవా మాట వినకపోయినందునవారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి.౹
7 ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది యుండలేదు గనుక వారికి సున్నతి చేయించెను; ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు.౹
8 కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడువరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి.౹
9 అప్పుడు యెహోవా–నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతోననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గా లనుపేరు.
10 ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.౹
11 పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్యములను తినిరి.౹
12 మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను; అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమునవారు కనానుదేశపు పంటను తినిరి.
13 యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేతపట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లి–నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా
14 అతడు–కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసి–నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను.౹
15 అందుకు యెహోవా సేనాధిపతి –నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ ఆలాగు చేసెను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOS/5-ba076d69e66429c24a6bea074c763cc4.mp3?version_id=1787—