Categories
ఆదికాండము

ఆదికాండము 8

1 దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసి కొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.౹

2 అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకా శమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.౹

3 అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైనతరువాత నీళ్లు తగ్గిపోగా

4 ఏడవ నెల పదియేడవదినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.౹

5 నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.౹

6 నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి

7 ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.౹

8 మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి వెలుపలికి పోవిడిచెను.౹

9 నీళ్లు భూమి అంతటిమీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను.౹

10 అతడు మరి యేడుదినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.౹

11 సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చి నప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.౹

12 అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.౹

13 మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.౹

14 రెండవనెల యిరువది యేడవదినమున భూమియెండి యుండెను.

15-16 అప్పుడు దేవుడు–నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.౹

17 పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతోకూడ నున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.౹

18 కాబట్టి నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి.౹

19 ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను.౹

20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.౹

21 అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి–ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.౹

22 భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/8-4a5c65db860db985a0562012a14a9ba8.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *