1 ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించినమీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను.౹
2 ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను.౹
3 అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్ల వలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను.౹
4 మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడునైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైనన తుకికు, త్రోఫిమును అతనితోకూడవచ్చిరి.౹
5 వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.౹
6 పులియనిరొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారియొద్ద ఏడు దినములు గడిపితిమి.
7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.౹
8 మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.౹
9 అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను.౹
10 అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీదపడి కౌగిలించుకొని–మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.౹
11 అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.౹
12 వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చి నప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
13 మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితిమి. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను.౹
14 అస్సులో అతడు మాతో కలిసికొని నప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి.౹
15 అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి.౹
16 సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫె సును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.
17 అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.౹
18 వారు తనయొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను–
నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు.౹
19 యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.౹
20-21 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచు కొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచ వలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్య మిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.౹
22 ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని,౹
23 బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.౹
24 అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.౹
25 ఇదిగో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు నేను మీమధ్యను సంచరించుచుంటిని; మీలో ఎవరును ఇకమీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును.౹
26 కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైననునేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.౹
27 దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.౹
28 దేవుడుతన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తుమందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి.౹
29 నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.౹
30 మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.౹
31 కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతిమనుష్యునికి మానక బుద్ధిచెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి.౹
32 ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు.౹
33 ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;౹
34 నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.౹
35 మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు–
పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము
అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.
36 అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను.౹
37 అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు౹
38 పౌలు మెడమీదపడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/20-3d8e8e447163a1862fc69517ae94ed78.mp3?version_id=1787—